విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన

  • ఏడాది చివరినాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి
  •  రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 ఎయిర్‌పోర్టుల్లో కొత్త కేఫ్‌లు ప్రారంభిస్తామని వెల్లడి
  • 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై, కిడ్స్ జోన్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ‘ఉడాన్‌ యాత్రి కేఫ్‌లు’ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఢిల్లీలో నిన్న ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విమాన ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రస్తుతం దేశంలోని 13 విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లు పనిచేస్తున్నాయని, ఆదివారం రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 విమానాశ్రయాల్లో వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా రాజ్‌కోట్‌, ఛండీగఢ్‌, ఇందౌర్‌, జమ్ము, పట్నా, అమృత్‌సర్‌, వారణాసి, గ్వాలియర్‌, అగర్తలా, జయపుర, లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుల్లో ఈ చౌక ధరల కేఫ్‌లను ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై సౌకర్యం, 10 ఎయిర్‌పోర్టుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్‌ జోన్‌లు, 16 విమానాశ్రయాల్లో ప్రయాణికులు పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా ‘ఫ్లైబ్రరీ’ వసతిని కూడా అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.

ఉడాన్ 2.0 పథకం కింద అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి చిన్న విమానాశ్రయాలను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. దీంతోపాటు 11 విమానాశ్రయాల్లో స్థానిక ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Rammohan Naidu
Civil Aviation
UDAN scheme
airports
flight travel
aviation ministry
airport facilities
Rajkot airport
India airports
airline passengers

More Telugu News